9, నవంబర్ 2011, బుధవారం

మోక్షపధం - రామ దర్శనం

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం. ఎలాగంటే -
అయోధ్య నగరం :
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.
సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది. రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.
లంకా పట్టణం :
సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి. లంకకు రాజు  దశకంఠుడు.  దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ  మాయాసంసారసాగరమే. 
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది. 
ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
ఆంజనేయుడు :
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు. 
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది. ఈ ఇంద్రియములను ఎలా జయించగలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగినవాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు. అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనందపరుస్తాడు. అంటే  ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది. ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు. 
ఇటుపై కధ అందరికీ తెల్సిందే. 
భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం. 
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -
శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
                                       మనోజవం మారుతతుల్యవేగమ్ 
                                       జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                                       వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                                       శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                              శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                              శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.


6 కామెంట్‌లు:

  1. This is d best interpretation I have read about *Rama* and *Ramayana*

    The Interpretation of *Ramayana*
    As a *Philosophy of Life*..

    ‘ *Ra* ’ means *light*, ‘ *Ma* ’ means *within me*, *in my heart*.
    So,
    *Rama* means the *Light Within Me*..

    *Rama* was born to *Dasharath & Kousalya*.

    *Dasharath* means ‘ *Ten Chariots* ’..
    The ten chariots symbolize the *five sense organs*( *Gnanendriya* ) & *five organs of action*( *Karmendriya* ) ..

    *Kousalya* means ‘ *Skill* ’..

    *The skillful rider of the ten chariots can give birth to Ram*..

    When the ten chariots are used skillfully,
    *Radiance* is born within..

    *Rama* was born in *Ayodhya*.
    *Ayodhya* means ‘ *a place where no war can happen* ’..

    When There Is No Conflict In Our Mind, Then The Radiance Can Dawn..

    The *Ramayana* is not just a story which happened long ago..
    It has a *philosophical*, *spiritual significance* and a *deep truth* in it..

    It is said that the *Ramayana is happening in our Own Body*.

    Our *Soul* is *Rama*,
    Our *Mind* is *Sita*,
    Our *Breath* or *Life-Force* ( *Prana*) is *Hanuman*,
    Our *Awareness* is *Laxmana* and
    Our *Ego* is *Ravana*..

    When the *Mind* (Sita),is stolen by the *Ego* (Ravana), then the *Soul* (Rama) gets *Restless*..

    Now the *SOUL* (Rama) cannot reach the *Mind* (Sita) on its own..
    It has to take the help of the *Breath – the Prana* (Hanuman) by Being In *Awareness*(Laxmana)

    With the help of the *Prana* (Hanuman), & *Awareness*(Laxmana),
    The *Mind* (Sita) got reunited with The *Soul* (Rama) and The *Ego* (Ravana) *died/ vanished*..

    *In reality Ramayana is an eternal phenomenon happening all the time*..

    రిప్లయితొలగించండి
  2. శ్రీరామ, సకల గుణాభిరామ వందనం👏
    స్వయాన వాల్మీకి మహర్షి రాముని గుణాలను వర్ణించతరం కాక "సకల గుణాభి రాముడు " అని చెప్పడం జరిగింది. ఇక మనమేం చెప్పగలం. కాని మనకు తోచిన రీతిలో స్మరించుకుందాం.

    ఉత్తమ విద్యార్థి :

    తన గురువైన విశ్వామిత్రుని అనుసరిస్తూ, ఆజ్ఞను పాటిస్తూ యజ్ఞ సంరక్షణ చేసినవాడు.

    పితృవాక్య పరిపాలకుడు :

    తనకు జన్మప్రసాదించిన తల్లిదండ్రులను సేవిస్తూ వారి కోరికలనే ఆజ్ఞలను పాటించేవాడు. కైకేయి మాతకు తన తండ్రి మాట ఇచ్చినాడని తెలిసిన మరుక్షణం అడవులకు వెళ్ళడానికి సంసిద్ధుడైనవాడు. తనను అడవులకు పంపడం న్యాయ సమ్మతం కాకున్నా తండ్రి మాటనే భగవదాజ్ఞగా పాటించినవాడు.

    ఇంకో విషయం రాముడికి సీత అంటే ఎందుకు ప్రేమంటే ఆమె తన తండ్రికి నచ్చింది కాబట్టి.

    భాతృ ప్రేమికుడు :

    తన నల్గురు తమ్ములు తనకు ఎందులోను సాటిరాకున్నప్పటికీ వారికి తమ తమ రాజ్యాలను అప్పగించినవాడు. యుద్ధంలో మూర్ఛ పొందిన లక్ష్మణుని చూసి " లక్ష్మణా ! నీవు లేని నాకు సీత ఎందుకు ? రాజ్యమెందుకు ? నేను కూడా నీతో ప్రాయోపవేశం చేస్తానని విలపించినవాడు.

    ఉత్తమ మితృడు :

    శ్రీరాముని స్నేహ భాగ్యం పొంది, ఆలింగన అదృష్టం పొందిన వారి వివరాలు చూస్తే శ్రీరామునికి ఎటువంటి జాతి భేదాలు లేవని తెలుస్తుంది. వారు సుగ్రీవుడు ( వానరం - కోతి ), గుహుడు ( నిషాదుడు - గిరిజనుడు ), విభీషణుడు ( దానవుడు - రాక్షసుడు ).

    శతృవులను సైతం గౌరవించేవాడు :

    తన భార్యను అపహరించిన రావణాసురుని సైతం గౌరవించి, వాడి మరణ సమయంలో ధర్మ శాస్త్రాలను నేర్చుకొని రమ్మని లక్ష్మణుని పంపినవాడు.

    ఉత్తమ భర్త :

    తనను అనుసరించి వచ్చిన జానకిని పోగొట్టుకొని చెట్లు పుట్టల వెంబడి తిరుగుతూ, విలపిస్తూ ఇద్దరే ఉన్నటువంటి సైన్యాన్ని సుగ్రీవుడితో స్నేహం చేసి కోట్లాది సైన్యంగా మార్చి రావణాసురుని హతమార్చి తన భార్యను దక్కించుకున్నవాడు. సీత పవిత్రతను లోకానికి ఎరుక పరచ నిశ్చయించి అగ్నిప్రవేశం చేయించినాడు.
    అందుకే ప్రతీ అమ్మాయి తనకు శ్రీరామునిలాంటి భర్త కావాలని కోరుకుంటుంది.

    రామో విగ్రహవాన్ ధర్మః :

    శ్రీరాముడు ధర్మపాలకుడు. ధర్మానికి మాత్రమే కట్టుబడినవాడు. వాలి బలవంతుడు, అతనితో స్నేహం చేస్తే జానకిని సులభంగా పొందవచ్చునని తెలిసినప్పటికి అతడు అధర్ముడు కనుక బలహీనుడైనప్పటికి సుగ్రీవునితో స్నేహం చేసినవాడు.

    శ్రీరాముడు రాజధానిలో తిరుగుతూ మొదట తనే ప్రతీ ఒక్కరికి నమస్కరించి వారి యోగ క్షేమాలను కనుక్కునేవాడట. ఒకవేళ ఎవరైనా తనకంటే ముందుగానే నమస్కరిస్తే తప్పు చేసినట్లు బాధపడేవాడట.

    భక్త పరంధాముడు :

    తన భక్తురాలైన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నవాడు, తన దాసుడైన హనుమ గుండెల్లో కొలువైనవాడు, తనకు గుడి కట్టించి జైలుపాలైన రామదాసును విడిపించ తానీష కు దర్శనమిచ్చి పైకం చెల్లించినవాడు శ్రీరామచంద్ర ప్రభువు.

    ఆరివీర భయంకరుడు :

    దండకారణ్యంలో తాటకి, మారీచ, సుబాహుల మొదలు 14,000 రాక్షసులను నిర్మూలించినవాడు, రావణ, కుంబకర్ణులను జయించి భూభారాన్ని తగ్గించినవాడు, పరశురాముని అహంకారాన్ని తొలగించిన కోదండరాముడు.

    పురుషోత్తముడు :

    దేవతలు నువ్వు శ్రీహరివి అని చెప్పినప్పటికి నేను దశరథ మహారాజు పుత్రుడను, మానవుడని చెప్పి తుదవరకూ మానవ నైజాన్ని ప్రదర్శించిన పురుషోత్తముడు.

    ప్రజారంజక పాలకుడు :

    నేను మానవావతారం ఎత్తి రావణ, కంభకర్ణుల సంహరించి, ఈ భూమండలాన్ని 10 వేల సంవత్సరాలను పాలిస్తాను అని దేవతలకు చెప్పడం జరిగింది.దానికి అనుగుణంగానే పూర్తి ప్రజారంజకంగా పాలించాడు. ప్రజలు అనుమానాలు వ్యక్తం చేశారని తన ప్రాణానికి ప్రాణమైన జానకిని అడవికి పంపించాడు.

    మనము పరమశివుని ఎప్పుడు కూడా ధ్యాన నిమగ్నుడవటం చూస్తూనే ఉంటాం. మనకు వచ్చిందో లేదో కాని ఆ జగజ్జనని పార్వతి మాతకు సందేహం వచ్చిందట, స్వామి ఎవరిని ధ్యానిస్తున్నారని, అదే ప్రశ్న శివుని అడిగిందట. అప్పుడు ఆ పరమ శివుడు, " ఓ హిమవత్ పుత్రీ ! నేను ధ్యానిస్తుంది ఎవరినో కాదు, ఆ నారాయణ అవతారము, పురుషోత్తముడు, లోకోత్తర పురుషుడు అయిన శ్రీరామ నామాన్ని " అని పలికెను. చూశారా ! ఆ ఆదిదేవుడే సదా రామ నామ ధ్యానంలో మునుగుతారంటే రామనామ మహిమ ఎంత ప్రశస్థమైనదో కదా ?

    ఇంకా శ్రీరామచంద్ర ప్రభువు గురించి ఎంత చెప్పినా తక్కువే.

    శ్రీరామ జయ రామ జయ జయ రామ

    శ్రీరామ నవమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. రామకథని మనకి భలే అన్వయం చేశారు. మనసంస్కృతిలో భగవానుని చేరే మార్గం చక్కగా విడమర్చి చూపెట్టారు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. నన్ను శరీరంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే జననం, ఒక అబద్ధం.
    నన్ను శరీరంలోంచి బయటికి తీసే మరణం, ఒక నిజం .
    అబద్ధం నుండి నిజం వైపు సాగేదే ................జీవితం!

    ఈ శరీరం మనం కాదు, అన్న భావన ప్రతి ఒక్కరికి కలగాలి .

    మాట్లాడేది శరీరం కాదు ,మనమే.నోరు మూసి ,కళ్ళు మూసి మనం మెదడు ప్రదేశంలో మాట్లాడతాం(శరీరంలోని మరే ప్రేదేశంలో మాటలు ,ఆలోచనలు ఉండవు). మాట్లాడేది మనమే కానీ, మెదడు కాదు . మెదడున్న ప్రదేశంలో మాట్లాడతాం. చూసేవి కళ్ళు కాదు, కళ్ల ద్వారా మనం చూస్తాం. చెవులు వినవు, చెవుల ద్వారా మనం వింటాం . నాలుకకు రుచి తెలియదు, రుచి తెలిసేది నాలుక ద్వారా మనకు. అలా చర్మం ద్వారా స్పర్శ మనకు తెలుస్తుంది .olfactory glands ద్వారా వాసనను మనం తెలుసుకుంటాం.
    శరీరమే అన్నీ తెలుసుకునేదయితే శవం ఎందుకు చూడదు? ఎందుకు వినదు , ఎందుకు స్పర్శకు స్పందించదు? శవం ఎందుకు ఆలోచించదు, ఎందుకు మట్లాడదు? ఎందుకంటే చూసేవాడు, వినేవాడు, స్పందించేవాడు శరీరాన్ని వదిలేసాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి... మనం శరీరంలో ఉండేవాళ్ళమే కదా. అంటే శరీరం వేరు, మనం వేరు. అతను పైలోకాలకు వెళ్ళిపోయాడు అంటాం,( మన కళ్లముందరే శరీరం అక్కడే ఉంటుంది. శరీరమే అతడైతే పోయాడని ఎందుకనాలి, అక్కడే ఉన్నాడు. శరీరాన్ని వదిలి వెళ్లిపోయాడని అర్థం. అంటే శరీరం వేరు, నేను వేరు. మేను ఎప్పటికీ నేను కాదు. నేను సెపరేట్ మేను సెపరేట్. ఈ" నేను" ను మనం ఆత్మ అనీ సోల్ అనీ ,సెల్ఫ్ అనీ అంటాం.
    శరీరంను రథం అనుకుంటే ఐదు ఇంద్రియాలు చేసే ఐదు రకాల పనులను కలిపితే పది. ఈ పది గుర్రాలతో శరీరాన్ని మనం నడిపిస్తాం. మనం దశరథుడు అని అర్థం. ప్రతీ మనిషికి మూడు గుణాలు ఉంటాయి అవి సత్వ గుణం ,రజో గుణం,తమోగుణం. సత్వగుణం అంటే కౌసల్య ,రజో గుణం అంటే సుమిత్ర , తమోగుణం అంటే కైకేయి. ఈ దశరథునికి ముగ్గురు భార్యలు అంటే ఆ మూడు గుణాలు మనకు భార్యలు అని అర్థం. దశరథుడు అయోధ్య నగరానికి రాజు, అయోధ్య అంటే యోదింప వీలు కానిది. అంటే, జయించడానికి వీలుకానిది అని అర్థం.

    మెదడున్న ప్రదేశాన్ని సహస్రారం అంటారు. సహస్రారం అనగా మెదడులో nuerons వెయ్యి ప్రదేశాలలో ముడిపడి ఉంటాయి. ధ్యానంలో గనక ఒక సాధకుడు ఈ వెయ్యి ముడులను శక్తితో విప్పగలిగితే, ఆ వెయ్యి ముడుల దగ్గర వెయ్యి పద్మ దళాలు కనిపిస్తాయి . అందుకే దీనిని సహస్రారం అంటారు.
    ధ్యానంలో ఒక్క ముడిని విప్పితే సాధకునికి 16 రకాల శక్తులు లభిస్తాయి. అలా 1000 ముడులను విప్పితే 1000× 16=16000 అవుతుంది .అంటే ఆ సాధకునికి 16000 రకాల శక్తులు వస్తాయి. శ్రీకృష్ణుడు ఈ వెయ్యి ముడులు ధ్యానంలో విప్పాడు. అందుకే ఆయనకు 16000 మంది భార్యలు అన్నారు.
    గుండె ప్రాంతంలో ఉండే ముడులను అనాహతం అంటారు . ఇవి 8 ఉంటాయి .ఈ ఎనిమిది ముడులను సాధకుడు ప్రయత్నపూర్వకంగా విప్పితే అక్కడ 8 పద్మ దళాలు కనిపిస్తాయి మరియు ఆ సాధకునికి అలా చేసినప్పుడు విపరీత ఆనంద ప్రాప్తి కలుగుతుంది . ఈ 8 ముడులను 8 భార్యలుగా చెప్పారు. శ్రీకృష్ణుడు ఇవీ విప్పాడు కాబట్టి, ఆయనకు 8 గురు భార్యాలన్నారు. శాస్త్రంలో ఎలా చెప్పారో, కథ కూడా అలాగే నడిచింది.
    ఇక మళ్లీ రామాయనానికి వద్దాం, సీత మిథిలా నగరంలో పుట్టింది. మిథ్య అంటే మాయ ,ఊహ, లేనిది, ఉట్టిదే అనీ అర్థం. లేనిదాన్ని ఊహించుకోవడం. సీత అనే బ్రహ్మ జ్ఞానం, రాముడు అనే పరమాత్మతో ఉన్నంత వరకు హాయిగా ఉన్నది. లేని బంగారు లేడి అనే కోరిక కలగడం వల్ల, జ్ఞానం పరమాత్మతో దూరమయ్యి రావణుడనే కోరికల కొలిమిలో పడి క్షోభించింది . పరమాత్మునితో లింక్ కోల్పోయిన ఆత్మను తిరిగి లింక్ ఏర్పరచడానికి పరమాత్ముడు జ్ఞానమనే వారధిని నిర్మించి రావణుని(దుర్గుణాలు) సంహరించి బ్రహ్మజ్ఞానమనే సీతను తిరిగి తెచ్చాడు. దీన్నే మన వాళ్ళు కట్టే ,కొట్టే ,తెచ్చే అన్నారు. అంటే దీనిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు .1.మనసును కట్టివేసి అహమును కొట్టేసి బ్రహ్మ జ్ఞానమనే సీతను తెచ్చే అని. 2.వారధి కట్టి రావణున్ని కొట్టి సీతను తెచ్చే అని.
    ఆత్మ పరమాత్మల సంయోగ, వియోగమే మన జీవితం. మనం మన స్వ స్థితిని అనగా ఆత్మ స్థితిని కోల్పోయి, శరీర స్థితిలో బతుకుతున్నాం. అందుకే వందల సమస్యలు. మనం అంతా ఆత్మలం. ఆత్మస్థితిలో, జ్ఞానస్థితిలో, ధ్యానస్థితిలో ఉండాల్సినోల్లం. శరీరం వేరు మనం వేరు. ఒకటొది మాంస శరీరం. రెండోది సూక్ష్మ శరీరం. మూడోది ప్రాణ శరీరం. నాల్గోది మనో శరీరం. ఐదోది జ్ఞాన శరీరం. ఆరోది విజ్ఞాన శరీరం. ఏడోది ఆత్మశరీరం. ఆరు శరీరాలు రాలితే మిగిలేది ఆత్మ. నిరంతరం ఆత్మ స్థితిలో ఉండాలంటే సాక్షి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. శుభమస్తు.

    రిప్లయితొలగించండి
  5. ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
    రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
    లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
    కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .

    రిప్లయితొలగించండి