10, అక్టోబర్ 2011, సోమవారం

క్షీరసాగరమధనం-అంతరార్ధం

ఓం గం గణపతయే  నమః                   ఓం శ్రీరామ శ్రీ హనుమతే నమః                     శ్రీ గురుభ్యో నమః 




పురాణేతిహాసములలో ఘటనులు, కధలు అవగాహనతో అవలోకిస్తే అందులో అంతరార్ధం అవగతమౌతుంది. వాటిని అర్ధంచేసుకుంటే ఆధ్యాత్మిక సాధకులకు అవరోధాలు, సందేహాలు తొలగి అంతఃకరణశుద్ధి కల్గి ఆనంద స్థితికి తద్వారా ఆత్మస్థితిని చేరుకుంటారు.
క్షీరసాగరమధనం కధలోని అంతరార్ధమును పరిశీలిస్తే -
క్షీరసాగరమధనం సాధకుని మనోసాగరమధనమునకు దర్పణం.
అది ఎలాగంటే -
ముందుగా సముద్రముకు మనస్సుకు వున్న సారూప్యములను  పరిశీలిస్తే  -
సముద్రములో కల్లోలతరంగములున్నట్లే,  మనస్సులో సంకల్పములనెడి అలలున్నాయి.
సముద్రములో  వ్యర్ధ,అవ్యర్ధ పదార్ధాలున్నట్లే,  మనస్సులో సగుణ దుర్గుణాలున్నాయి.
సముద్రములో మకరతిమింగలాది భయంకర జంతువులున్నట్లే,  మనస్సులో  కామ క్రోధ మద మోహమాత్సర్యాలాది క్రూరగుణాలున్నాయి.
సముద్రములో రత్నాదులున్నట్లే,  మనస్సులో శాంతశమదమాది దైవ గుణాలున్నాయి.
సముద్రములో సుడులున్నట్లే, మనస్సులో ఆశలను సుడులున్నాయి.
సముద్రం అగాధమైనట్లే మనస్సులోతు తెలుసుకోవడం కూడా అసాధ్యమే.
అందుకే ప్రతీ మానవుని చలించే,చరించే, చెలరేగే మనస్సే మహాసాగరం.
ఇక సాగరమధనంనకు క్షీరసాగరమే ఎందుకు కావాలంటే - 
క్షీర వర్ణం తెలుపు; అంటే స్వచ్ఛమైన సాగరం మాత్రమే మధనంనకు అర్హతకల్గివుంటుంది. అలానే స్వచ్ఛమైన మనస్సు అంటే సత్వ గుణముగల మనస్సుకే అంతరమధనమునకు అర్హత ఏర్పడుతుంది. అనగా తత్వచింతనగల సాత్వికమనస్సే క్షీరసాగరం.
ఇక దేవదానవులు -
ప్రతిసాధకునిలో దేవాసురగుణాలే  దేవదానవులు. ఎలాగంటే ప్రతి ఒక్కరిలో శమ, దమ, సత్య, శాంత, శౌచ, దయాది సాత్విక గుణములు దేవతలుగా; ఆలస్యం, అలసత్వం, అనుమానాలు, అజాగ్రత్త, అశ్రద్ధ, అస్థిరం,ఆగ్రహం, బుద్దిహీనత మొదలగు తమో రజో గుణములు దానవులుగా భావించాలి.
క్షీరసాగరమధనంకై 'మందర పర్వతం' కవ్వమైనట్లు మనోసాగరమధనంలో 'బుద్ధి' కవ్వం కావాలి.
అక్కడ 'వాసుకి' త్రాడైతే ఇక్కడ 'ఆత్మానుసంధానము'ను పాశముగా చేసుకోవాలి.
క్షీరసాగరమధనం జరుగుతుండగా మందర పర్వతం సముద్రంలో దిగబడిపోయినట్లే బ్రహ్మనిష్ఠలోగూడ  ఆత్మానుసంధానం నిరంతరం సాగక మనస్సులోనికి  బుద్ధి జారిపోయి ధ్యానమందు విఘ్నములు కల్గుచుండును. భక్తవత్సలుడగు భగవంతుడు కూర్మావతారమును ఎత్తి తనవీపుపై పర్వతమును ధరించి పైకి తీసినట్లు దైవకృపకు పాత్రులైన సాధకుల ధ్యానముకు కూడా చిన్నచిన్న ఆటంకములు కలిగిన క్రమముగా నిర్విఘ్నంగా జరుగును.  
క్షీరసాగరమధనంలో ముందుగా హాలాహలం బయటపడగా దేవతల ప్రార్ధనచే శివుడు ఆ హాలాహలమును స్వీకరించెను. అలానే ధ్యానసాధన అధికమైనప్పుడు అంతఃకరణంలోగల జన్మజన్మాంతర విషసమాన విషయవాసనలు బయటపడును. శారీరక, మానసిక ఆర్ధిక మొదలగు అనేకబాధలు కల్గవచ్చు. అప్పుడే ఎంతో అచంచలమైన బుద్ధితో, అనన్యభక్తితో, పరిపూర్ణ శరణాగతితో  ఈశ్వరప్రార్ధనచేస్తే ఆ భగవంతుడే అన్నింటినీ హరింపజేస్తాడు. 
ఈ విధముగా క్షీరసాగరమధనం జరుగుతుండగా తొమ్మిది అద్భుత శక్తులు ఉద్భవించినవి. వాటితో తృప్తిపడక ఇంకా మధనం చేసిరి. అప్పుడు అమృతం ఉద్భవించినది. అలానే సాధకులు తమ సాధనాయోగమందు ఎన్నెన్ని సిద్ధులు ప్రాప్తించినను వాటిని త్యజిస్తూ తమ లక్ష్యమైన ముక్తియనెడు అమృతత్వం లభ్యమైనంతవరకు లక్ష్యసాధన వీడకుండా ప్రయత్నించవలెను. అప్పుడే ఆత్మదర్శనం, ముక్తియనెడు అమృతత్వంను పొందుదురు.
ఆధ్యాత్మికసాధకులు అంతరమధనముచే జ్ఞానామృతపానంచేసి కైవల్యం చెందుటయే క్షీరసాగరమధనంయొక్క అంతరార్ధం.


4 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు లో ఈ ఒక్క పోస్ట్ చదివానండి.
    చాలా నచ్చింది.వివరముగా అన్నీ చూస్తాను.
    నా బ్లాగు కి వచ్చినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. గీత_యశస్వి గారు!
    క్షీరసాగారమధనం-అంతరార్ధం పోస్ట్ మీకు నచ్చినందులకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గార్కి, 'స్మరణ' లో టపాలు చదివి, నచ్చి, మీరు పెట్టిన వ్యాఖ్యలకు మనసార ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి